కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో 2020-21 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటివరకు ఒకటికిమించి పరీక్షలు రాస్తూ వస్తున్న యువతకు శుభవార్త అందించారు. ఇకపై నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించబోతున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. త్వరలోనే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసి, ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. నాన్ గెజిటెడ్ ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలను నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుందని, అన్నింటికీ కలిపి ఒకే పరీక్షను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం భారంగా మారిందని, యువతకు కూడా ఈ విధానం సులభంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉమ్మడి పరీక్షను నిర్వహించేందుకు ప్రతీ జిల్లాలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని పేర్కొన్నారు.
[subscribe]