మహారాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలకు ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మే 11, సోమవారం నాడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయనతో పాటుగా భార్య రష్మి, కుమారులు ఆదిత్య, తేజస్ థాకరే లు, మహా వికాస్ అఘాడీ కూటమికి చెందిన నాయకులు ఉన్నారు. శాసన మండలిలో ఖాళీగా ఉన్న తొమ్మిది స్థానాలకుగానూ ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల్ని నిలిపేందుకు సిద్ధమవడంతో ఎన్నికలు అనివార్యమయ్యేలా కనిపించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గడంతో ఉద్దవ్ థాకరే కు ఏకగ్రీవంగా మండలిలో అడుగుపెట్టడం ఇక లాంఛనమే కానుంది.
ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజు మే 11 కాగా, నామినేషన్ల పరిశీలన మే 12 న జరగనుంది. నామినేషన్లకు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ మే 14 గా, ఎన్నికల నిర్వహణ తేదీని మే 21 గా నిర్ణయించారు. మొత్తం 9 స్థానాలకు బీజేపీ నుంచి నలుగురు, శివసేన, ఎన్సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుండి ఒకరు ఎన్నికయ్యే అవకాశం ఉంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాకరే మహారాష్ట్ర శాసనసభలో గానీ, శాసనమండలిలో గానీ సభ్యుడు కాదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోగా ఆయన ఉభయ సభల్లో ఏదో ఒక్కదాంట్లో సభ్యత్వం పొందితేనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడడంతో ఉద్దవ్ పదవిపై ఉత్కంట నెలకుంది. ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఈసీకి లేఖ రాయడంతో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ అస్థిరత రాకుండా పరిస్థితి సద్దుమణిగింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu