వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరో సారి లక్ష కోట్లు దాటాయి. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,10,828 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.20,944 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.28,224 కోట్లు, ఐజీఎస్టీ రూ.53,013 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.23,481 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి 8,637 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.824 కోట్లు) వసూలు అయ్యాయి. జీఎస్టీ పేరుతో కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 2017 నవంబరులో తొలిసారిగా పన్ను వసూళ్లు రూ.1.1లక్షల కోట్లు దాటగా, ఇది రెండోసారి కావడం విశేషం.
జనవరి నెల మొదట్లో సీనియర్ టాక్స్ అధికారులతో రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించుకున్న వసూళ్ల లక్ష్యానికి అనుగుణంగానే జనవరిలో జీఎస్టీ సేకరణ జరిగినట్టుగా తెలుస్తుంది. 2019 జనవరి జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే ఈసారి 12% వృద్ధిని కనిపించిందని అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే వస్తువుల దిగుమతుల నుండి వసూలు చేసిన ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఐజీఎస్టీ) ను పరిగణనలోకి తీసుకుంటే, 2019 జనవరిలో వచ్చిన ఆదాయంతో పోల్చితే జనవరి 2020 లో మొత్తం ఆదాయంలో 8% వృద్ధి కనిపించిందని అధికారులు పేర్కొన్నారు.
[subscribe]