రాష్ట్రంలో పాలక పక్షం పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలకు, కక్ష సాధింపులకు వాడుకోవడం మీద చూపించిన శ్రద్ధ పోలీస్ సిబ్బంది ఇబ్బందులను తీర్చడం మీద చూపడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చాం అని ప్రసంగాల్లో చెప్పుకోవడం తప్ప వాస్తవంలో అమలు కావడం లేదు. పోలీసులకు అందాల్సిన ప్రయాణ భత్యం (టి.ఏ) 14 నెలల నుంచి బకాయిపెట్టారు. విధి నిర్వహణలో ప్రయాణాలు ఎక్కువగా ఉండే పోలీసులకు సంబంధిత మొత్తాలను ఇవ్వకుండా నిలిపి వేస్తే ఏ విధంగా పని చేయగలరు?, సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు సిబ్బంది నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలతో ఆందోళన చెందుతున్నారు. తమ జీతం నుంచి భద్రత పేరుతో కొంత మొత్తాన్ని మినహాయించుకొంటున్నారని, ఆ మొత్తాన్ని ఇంటి నిర్మాణ సమయంలోనో, మరో అత్యవసర సందర్భంలోనో రుణంగా తీసుకోవచ్చని ఇందుకోసం దరఖాస్తు చేస్తే పెండింగ్లో ఉంచడమో, తిరస్కరించడమో చేస్తున్నారని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు” అని అన్నారు.
“దిగువ స్థాయి సిబ్బందికి భద్రత రుణాలు, సరెండర్ మొత్తాలు ఇవ్వడానికి వస్తున్న ఆటంకాలు ఏమిటో అర్థం కావడం లేదు. అసలు పోలీసు భద్రత కోసం జీతాల నుంచి మినహాయించిన మొత్తాలు భద్రంగా ఉన్నాయా?, జమయిన ఆ మొత్తాన్ని ఏమి చేశారో పాలకులు వివరణ ఇవ్వాలి. తమ సమస్యల గురించి అడిగిన చిరుద్యోగులను వేధించడం ద్వారా సిబ్బందికి ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకొంటున్నారో చెప్పాలి. నంద్యాలలో సురేంద్ర అనే కానిస్టేబుల్ ను హత్య చేస్తే, ఆ కేసులోని నిందితుల్లో ఒకరిని ఇప్పటికీ అరెస్టు చేయలేకపోయారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆత్మసైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఉన్నతాధికారులు సైతం సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి రావాల్సిన టిఏలు, సరెండర్ మొత్తాలు సకాలంలో అందేలా చూడాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY