ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని డా. వైఎస్సార్ వర్సిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మండిపడింది. రెండున్నర దశాబ్దాలుగా ఉన్న ఎన్టీఆర్ పేరుని ఇప్పుడే ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించింది. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు ఆలోచనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం స్థానానికి వెళ్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాగితాలను చింపివేసి స్పీకర్పై వేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జోహర్.. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే స్పీకర్ ఎన్నిసార్లు కోరినా తమ స్థానాలకు తిరిగి వెళ్లకపోవడంతో టీడీపీ సభ్యులపై ఆయన సస్పెన్షన్ విధించారు. ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యులపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ అధికార సభ్యుల అంగీకారంతో ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. దీంతో వరుసగా ఐదోరోజు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు సభ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం సభ తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించింది.
ఇక ఇదిలా ఉండగా మరోవైపు శాసన మండలిలోనూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియంను చుట్టూ ముట్టారు. ఎన్టీఆర్ పేరు మీద జిల్లా ఏర్పాటు చేశామని చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని ఎందుకు తొలగిస్తోందంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY