ప్రముఖ తెలుగు నటుడు, టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు తండ్రి, సూపర్స్టార్ కృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కన్నుమూశారు. ఈ మేరకు ఆయనకు చికిత్స అందిస్తున్న కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కాగా సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే కృష్ణకు కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించిన వైద్యులు వెంటిలేటర్పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు. ఆయనకు వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం చికిత్స అందించినట్లు ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో ఈరోజు వేకువజామున కృష్ణ మరణించారు.
కుటుంబ నేపథ్యం
ఇక కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో 1942 మే 31న ఆయన జన్మించారు. వారి తల్లిదండులకు మొత్తం నలుగురు సంతానం కాగా, వారిలో కృష్ణ పెద్దవాడు. కృష్ణ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మొత్తం ఐదుగురు సంతానం కాగా, కుమారులు రమేశ్ బాబు, మహేశ్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ఇక, కృష్ణ ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో కన్నుమూయగా, సతీమణి ఇందిరాదేవి కూడా ఇటీవలే కన్నుమూశారు.
సినీ ప్రయాణం
సినిమాలపై ఆసక్తితో కాలేజీ చదువుల అనంతరం మద్రాసు చేరుకొని సినీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ‘కుల గోత్రాలు’ (1961), ‘పరువు ప్రతిష్ఠ’ (1963) మరియు ‘పదండి ముందుకు’ (1962) వంటి చిత్రాలలో చిన్న పాత్రలతో తన కెరీర్ను ప్రారంభించాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ 1965లో ‘తేనెమనసులు’ ద్వారా తొలిసారి హీరోగా నటించారు. అది ఘనవిజయం సాధించడంతో ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో 350కి పైగా చిత్రాలలో నటించడం విశేషం. ఇక కృష్ణ చిన్న కుమారుడు మహేష్ బాబు ఆయన వారసుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి అనతికాలంలోనే తెలుగు అగ్ర హీరోలలో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు.
సినిమాల్లో ప్రయోగాలు..
ఇక కృష్ణ తెలుగు సినిమాల్లో మూస పద్దతికి విరుద్ధంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా అప్పుడప్పుడే హాలీవుడ్ సినిమాల్లో వస్తున్న కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని తెలుగు ప్రేక్షకులకు సరికొత్త జానర్లను పరిచయం చేశారు. తెలుగులో తొలి జేమ్స్బాండ్ తరహా సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి అఖండ విజయం సాధించాయి. వీటితో పాటుగా ఆనాటి అగ్ర నటీనటులతో పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, కొడుకులు దిద్దిన కాపురం వంటి ఫామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఈనాడు, అగ్నిపర్వతం, రామరాజ్యంలో భీమరాజు వంటి సూపర్ హిట్ కమర్షియల్ చిత్రాలు తీశారు. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాల్లో నటించారు.
ఇక 1970లో సొంతంగా పద్మాలయా అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి తన సోదరుల ఆధ్వర్యంలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. అలాగే 1983లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో పద్మాలయా స్టూడియోను కూడా నెలకొల్పారు. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకుడిగానూ కృష్ణ 16 సినిమాలు తెరకెక్కించారు. ఇక సినీ రంగానికి కృష్ణ చేసిన సేవలకు గానూ ఆయనకు 2009లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. దీనితో పాటు ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008) వంటివి ఆయన దక్కించుకున్నారు. కాగా కృష్ణ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాలలో కూడా ప్రవేశించారు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా పోటీ చేసి గెలుపొందారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE