ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తప్పించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శుక్రవారం నాడు లేఖ రాశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తీ డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను విధులనుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో స్థానిక ఎన్నికల ప్రక్రియలో వైఫల్యం మరియు పోల్ హింస సంఘటనలకు సంబంధించి, ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించామని, అయితే వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించకపోవడాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. మళ్ళీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుండడంతో వీరిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు.
ఈ ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుత చిత్తూరు మరియు గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్-1 లకు బాధ్యతలు అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని సూచించారు. అలాగే తిరుపతి అర్బన్ ఎస్పీని తన బాధ్యతలను చిత్తూరు ఎస్పీకి అప్పగించాలని చెప్పారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మరియు తిరుపతి అర్బన్ ఎస్పీ స్థానాల్లో తగిన అధికారులతో 3 పేర్లతో కూడిన ప్యానెల్ ను సమర్పించాలని సీఎస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ