తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్ర ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం రేవంత్ రెడ్డి సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ వద్ద కార్మికులతో ‘గేట్ మీటింగ్’ నిర్వహించారు. ఈ క్రమంలో కార్మికులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరైన సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ మరియు విద్యుత్ విభాగాలోని కార్మికుల పాత్ర కీలకమైనదని, సకల జనుల సమ్మెకు వారు నడుం బిగించాకే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని పేర్కొన్నారు. కార్మిక సంఘాలను సీఎం కేసీఆర్ కుటుంబమే గుత్తాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతూ సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని, వేలాది కోట్లు కొల్లగొట్టడానికే తప్ప కార్మికుల సమస్యలు తీర్చడానికి ప్రయత్నించడం లేదని పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే రాష్ట్రం ఏర్పడ్డాక, ఆయా కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బొగ్గుగని కార్మిక సంఘానికి సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసి కార్మిక సంఘానికి మేనల్లుడు, మంత్రి హరీష్ రావులే గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని, అలాంటప్పుడు కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు? అని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని, ఆయనకు సీఎం కేసీఆర్ సహకారం అందిస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. ఇక ఈ తొమ్మిదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలల్లా కలిసే ఉన్నాయని, కానీ ప్రజా వ్యతిరేకత గుర్తించి ఇప్పుడు వేరుగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని, ప్రధాని మోదీ నిర్ణయాలన్నింటికీ సీఎం కేసీఆర్ సహకరించారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE