త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. దావోస్ కు వెళ్లక ముందు గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ సమావేశంలో ఎన్నికల్లో నిర్వహించాల్సిన వ్యూహాలపై చర్చించి 12కు తగ్గకుండా గెలిచి తీరాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ సంఖ్య మరో రెండు పెంచారు. మొత్తం 17 స్థానాలకు గాను 14 గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. విదేశీ పర్యటన ముగించుకుని నిన్ననే రాష్ట్రానికి విచ్చేసిన రేవంత్ రెడ్డి ఎన్నికలపై దృష్టి సారించారు. త్వరలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలకు సమావేశాలకు తేదీలను ఖరారు చేశారు.
దావోస్ కు వెళ్లే ముందు ఢిల్లీలోని ముఖ్య నేతలను కలిసిన రేవంత్ కు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలను కాంగ్రెస్ పక్కాగా గెలిచే అవకాశం ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నట్లు సమాచారం. పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల పేర్లను త్వరితగతిన అధిష్టానానికి నివేదించాలని సూచించినట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల పోరు ప్రారంభమైనట్లేనని ఇక ప్రచార వ్యూహాలకు పదును పెట్టాలని నేతలకు సూచించారు. అలాగే.. ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ లోక్సభ కో ఆర్డినేటర్లతో కూడా ఖర్గే సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు తో భేటీ అయి.. వచ్చే ఎన్నికలలో పార్టీలోని వివిధ స్థాయిల్లోని నేతలు చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి నేతలకు ఢిల్లీ నేతలు కూడా కీలక సూచనలు చేశారు. ప్రచారంతో పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం ఎలా అవ్వాలన్నదానిపై మార్గనిర్దేశనం చేశారు. ఎన్నికల విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసినట్లుగానే లోక్సభ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆదేశించారు. మెజారిటీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. అయితే.. సోనియాగాంధీ తెలంగాణలో పోటీ చేసేలా ఒప్పించాలని రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లగొండ లోక్సభ స్థానాన్ని మూడు లక్షల మెజారిటీతో కాంగ్రెస్ గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
12 సీట్లలో గెలిచి తీరాలని కొద్ది రోజుల ముందు రేవంత్ పేర్కొనడాన్ని ఆరా తీస్తూ.. 12 కాదు.. రాష్ట్రంలో 14 సీట్లలో పార్టీకి విజయవకాశాలు మెండుగా ఉన్నాయని అధిష్ఠాన పెద్దలు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే.. రాష్ట్రంలోని 17 సీట్లను గెలవడమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని పేర్కొంటూ.. అందులో తెలంగాణ ముందు వరుసలో ఉండాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం ఒత్తిడితో రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇకపై తరచూ నేతలతో సమావేశం అవుతూ లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లను సాధించడమే ధ్యేయంగా పనిచేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE