తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయింది. గ్రూప్స్ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు ప్రభుత్వంపై పెద్ద యుద్ధమే చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. ఇక ప్రస్తుతం టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీని ఎంపిక చేశారు.
టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈక్రమంలో చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు.. సభ్యుల పదవులకి 320కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే విదేశీ పర్యటన ముగించుకొని రాగానే టీఎస్పీఎస్సీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. చివరికి కొత్త చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న వారిలో మహేందర్ రెడ్డి ఒక్కరే ఉండగా.. ఆయననే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ప్రభుత్వం సిఫార్సు చేసింది. గవర్నర్ ఆమోదం తెలిపితే మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇకపోతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి గతంలో అన్నారు. అన్నట్లుగానే ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే యూపీఎస్సీ చైర్మన్ను రేవంత్ రెడ్డి కలిసి చర్చలు జరిపారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వాధికారులు కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు వెళ్లి అక్కడి వ్యవస్థలను పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY