ఏపీలో అసమ్మతి సెగ భగ్గుమంటోంది. టికెట్ ఇవ్వలేదని.. సరైన ప్రధాన్యత దక్కడం లేదని పెద్ద ఎత్తున నేతలు వైసీపీకి, పదవులకు రాజీనామాలు చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇప్పుడు నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అదే బాటలో వెళ్లారు. మంగళవారం వైసీపీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈసారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని హైకమాండ్ కోరుతోందని.. దానివల్ల కేడర్ అయోమయంలో పడిపోయిందని శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. అందుకే తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అయితే ఈసారి నరసరావుపేట నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. మొన్నటి వరకు కూడా నరసరావుపేట నుంచి నాగార్జునను పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ముగ్గురు కొత్త వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారిలో ఒకరిని నరసరావుపేట నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపేందుకు జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారట.
అనిల్ కమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తన నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టేశారట. అయితే నెల్లూరు సిటీ నుంచి మంచి అభ్యర్థి దొరికితే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. అనిల్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన్ను బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారట.
ఒకవేళ అనిల్ కాకపోతే రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావును.. ఆయన కూడా కాకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నరసరావుపేట నుంచి బరిలోకి దింపాలని జగన్ కసరత్తు చేస్తున్నారట. మరి చివరికి ఆ ముగ్గరికిలో ఎవరికి నరసరావుపేట టికెట్ కట్టబెడుతారో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY