ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటే కొంత మందికి అర్ధం కాకపోవచ్చు కానీ..EPFO అంటే అందరికీ బాగా తెలుసు. అయితే తాజాగా ఈపీఎఫ్ఓలో డిజిటల్గా కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈపీఎఫ్ఓ 3.0తో 9 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి వివరించారు. మే లేదా జూన్కల్లా కొత్త వెర్షన్ను తాము అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు.
ఈపీఎఫ్ఓ వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం కానున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి చెప్పారు. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు, డిజిటల్ కరెక్షన్లతో పాటు..ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యంగా, సమర్థంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమని మన్సుఖ్ మాండవీయ వివరించారు.
క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం, ఈపీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వెర్షన్తో తొలగబోతున్నాయని మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి వారి బ్యాంక్ అకౌంట్లలో త్వరగా జమ అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను ఈపీఎఫ్ఓ కలిగి ఉందని.. ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు 8.25 శాతం వడ్డీని కూడా అందిస్తోందని చెప్పారు.
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఇప్పటికే భారత దేశంలోని ఏ బ్యాంక్ నుంచైనా సరే పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించామని మన్ సుఖ్ మాండవీయ అన్నారు. దీనివల్ల 78 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని ఆయన వివరించారు. అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలన్నింటిని కూడా ఏకీకృతం చేసి పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడం, బలోపేతం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని అన్నారు.