తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 194 ఏఈవో గ్రేడ్-2 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు మే 19, మంగళవారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. కాగా పొరుగుసేవల విధానంలో ఏఈవో పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
వ్యవసాయ శాఖలో ఏఈవోల నియామకాలకు అనుమతించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రైతులకు వ్యవసాయంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖలో 2638 ఏఈవో పోస్టులకు గాను 2444 మంది విధులలో ఉన్నారని, సమగ్ర వ్యవసాయ విధానం అమలుకోసం మిగిలిన 194 క్లస్టర్లలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈవోల భర్తీకి ఆదేశాలు జారీచేయడం జరిగిందని చెప్పారు. రెగ్యులర్ ప్రాతిపదికన అధికారులను నియమించే వరకు క్షేత్రస్థాయులో రైతులకు ఇబ్బందులు రాకుండా వీరిని నియమించడం జరుగుతుందని అన్నారు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 2167 ఏఈవోలను, నూతన మండలాల ఏర్పాటు నేపథ్యంలో 114 ఏఈవోలను నియమించడం జరిగిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ సలహాలు అందాలని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సాగునీరు, ఉచిత కరెంట్ తో పాటు రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోలుతో రైతులలో ఆత్మవిశ్వాసం నింపిందని, ఆరేళ్లలో దేశానికి దిక్సూచిలా నిలిచే నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు. వ్యవసాయానికి ఊతమిచ్చే చర్యలు తెలంగాణ మాదిరి ఏ రాష్ట్రంలోనూ తీసుకోవడం లేదని, సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలుతో రైతును మరింత ఉన్నత స్థితిలో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని, అందుకు అనుగుణంగానే 24 గంటలలో ఏఈవో నియామకాల జీఓ విడుదలకు ఆదేశాలిచ్చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]