తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు మే 21, గురువారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించారు. వారితో సీఎం కేసీఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వారిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలనూ ఖరారు చేసేందుకు మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్ ను రూపొందిస్తారు. ఆ పంటల మ్యాప్ పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించి ప్రకటించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu