తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. కేంద్రానికి సీజేఐ గవాయ్ సిఫారసు

Supreme Court CJI Gavai Recommends Justice Surya Kant as His Successor

భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, సుప్రీంకోర్టు సంప్రదాయాన్ని అనుసరించి, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి లాంఛనంగా సిఫారసు చేశారు. ప్రస్తుత సీజేఐ బి.ఆర్. గవాయ్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో, ఈ సిఫారసు ప్రాధాన్యత సంతరించుకుంది.

కొలీజియం సంప్రదాయం:

సాధారణంగా, సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తదుపరి సీజేఐగా నియమించడం కొలీజియం యొక్క సుదీర్ఘ సంప్రదాయం. ఈ ప్రక్రియలో భాగంగా, ప్రస్తుత సీజేఐ తన వారసుడిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును కేంద్ర న్యాయశాఖ మంత్రికి సిఫారసు చేస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటించడంలో భాగంగా, జస్టిస్ గవాయ్ ఈ సిఫారసు చేశారు.

కేంద్ర ప్రభుత్వం దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది. కాగా, గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

తదుపరి సీజేఐ ప్రొఫైల్:

జస్టిస్ సూర్యకాంత్ గారు హర్యానాలోని హిస్సార్‌లో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) పదవికి ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ సిఫారసు చేయడంతో ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం పీఠాన్ని అధిరోహించడానికి సిద్ధమవుతున్నారు.

సంచలనాత్మక తీర్పులలో భాగస్వామ్యం:

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ అనేక ముఖ్యమైన, చారిత్రక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. వాటిలో కొన్ని..

  • 370వ అధికరణ రద్దు: జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు.
  • ప్రజాస్వామ్యం, హక్కులు: భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటి కీలక అంశాలపై ఇచ్చిన తీర్పులు.
  • ఓటర్ల జవాబుదారీతనం: ఎన్నికల జవాబుదారీతనాన్ని చాటుతూ, బిహార్ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను వెల్లడించాలని ఇటీవల ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు.
  • మహిళా రిజర్వేషన్లు: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని చారిత్రక ఆదేశాలు జారీ చేశారు.

మరికొన్ని కీలక అంశాలు:

2022లో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనంలో కూడా జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. అలాగే, రక్షణ బలగాలకు సంబంధించి ముఖ్యమైన ఓఆర్ఓపీ (OROP) పథకాన్ని సైతం ఆయన ధ్రువీకరించారు. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here