పార్లమెంట్‌లో కీలక ఘట్టం.. యాంటీ పేపర్ లీక్, వందేమాతరం బిల్లులకు ఆమోదం

Parliament Monsoon Session Anti-Paper Leak and Vande Mataram Bills Passed Amid Opposition Uproar

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈసారి తీవ్ర ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన విద్యార్థుల భారీ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రెండు కీలక బిల్లులకు పార్లమెంటులో ఆమోదం లభించింది.

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో విశ్వసనీయతను పెంచడం, పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫేర్ మీన్స్) సవరణ బిల్లు 2026’ (యాంటీ పేపర్ లీక్ బిల్లు)ను ప్రవేశపెట్టింది.

మరోవైపు, జాతీయ గేయం ‘వందేమాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన’తో సమానంగా చట్టబద్ధమైన రక్షణ కల్పించే ఉద్దేశంతో ‘నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు 2026’ (వందేమాతరం బిల్లు)ను రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రెండు కీలక బిల్లులపై ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చల అనంతరం..  విపక్షాల నిరసనలు, హంగామా మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి.

పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా

పరీక్షల నిర్వహణలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన నూతన బిల్లు ప్రకారం, ఇకపై అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. సాధారణ అక్రమాలకు జరిమానాను రూ.50 లక్షల వరకు పెంచగా, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదించారు.

ఈ పేపర్ లీక్ ఘటనలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసేందుకు పోలీసు దర్యాప్తును 2 నెలల్లో (60 రోజులు) పూర్తి చేయాలని, అలాగే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఛార్జ్‌షీట్ దాఖలైన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లులో స్పష్టం చేశారు.

వందేమాతరానికి చట్టబద్ధ రక్షణ.. అవమానిస్తే 3 ఏళ్ల జైలు

మరోవైపు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ‘వందేమాతరం బిల్లు’ ద్వారా ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971’ చట్టానికి కీలక సవరణలు చేస్తున్నారు. దీనిప్రకారం వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా లేదా దాని ఆలపనకు ఆటంకం కలిగించినా 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.

1950లో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేసినట్లుగానే, స్వాతంత్య్ర సమరంలో కీలక భూమిక పోషించిన వందేమాతరం గేయానికి సముచిత గౌరవం మరియు చట్టపరమైన రక్షణ కల్పించడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

సభలలో విపక్షాల నిరసనలు, రాజకీయ వేడి

అయితే, ఈ రెండు బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెడుతున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. నీట్-యూజీ పరీక్షల వివాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ బిల్లులను హడావుడిగా తీసుకువచ్చిందని ఆరోపించారు. బలవంతంగా దేశభక్తిని రుద్దడం రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని విపక్ష నేతలు సభలో నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్య రాజ్యసభ మరియు లోక్‌సభ వాయిదా పడుతూ వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here