రాజధాని అమరావతి నిర్మాణం ఆపడం ఇక ఎవరి తరమూ కాదని, అమరావతి ప్రగతి పయనం అన్స్టాపబుల్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బకింగ్హామ్ కాలువపై నూతనంగా నిర్మించిన స్టీల్ వంతెనను మరియు రాజధానికి ప్రధాన రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డును మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణలతో కలిసి గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి డిజైన్లను గతంలో ‘గ్రాఫిక్స్’ అని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు.
రాజధాని అమరావతిని విజయవాడ-మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేలా సీడ్ యాక్సెస్ రోడ్డును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించామని సీఎం తెలిపారు. అమరావతి ప్రాజెక్టు అభివృద్ధిలో ఈ రహదారి ప్రారంభమే తొలి కీలక విజయం అని, భవిష్యత్తులో ఇలాంటి ప్రపంచ స్థాయి రహదారులు మరెన్నో అందుబాటులోకి రానున్నాయని వివరించారు. 2028 నాటికి రాజధాని అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్ది, నూతన రాజధాని నగరాన్ని ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి నగరాన్ని పురాతన సింధూ నాగరికత గ్రిడ్ విధానంలో, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నామని చంద్రబాబు వివరించారు. విద్యుత్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుల్స్ కోసం డక్ట్లు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో రహదారులను తవ్వాల్సిన అవసరం ఉండదని, భూగర్భ గ్యాస్ లైన్లు, డిస్ట్రిక్ట్ కూలింగ్ లాంటి అధునాతన సదుపాయాలు ఉంటాయని తెలిపారు. కృష్ణా నది ఒడ్డున రూపుదిద్దుకుంటున్న ఈ రాజధాని నగరానికి నీటి కొరత ఉండదని, గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
గత వైకాపా ప్రభుత్వం అమరావతి నిర్మాణాలు నిలిపివేసి రైతులను తీవ్రంగా వేధించిందని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి అమరావతి ఉద్యమాన్ని నిలబెట్టిన రైతు త్యాగాలు వృథా పోవని, విజన్ లేని వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. అమరావతి నామకరణంలో ‘ఈనాడు’ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పాత్రను స్మరించుకున్న సీఎం, రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతిని ఆర్థిక సముదాయంగా, గ్రీన్ సిటీగా ప్రపంచ పటంలో నిలుపుతామని వ్యాఖ్యానించారు.







































