జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 9, గురువారం నాడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి, రాష్ట్రంలో లాక్డౌన్ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, లాక్డౌన్ పొడిగింపు, అపుడు అనుసరించాల్సిన విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ చెప్పిన సూచనలు పాటిస్తూ, పేద ప్రజలకు ఏ విధంగా అండగా నిలవాలనే అంశంపై ఒక ప్రణాళికను అనుసరిద్దామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
“రాష్ట్రంలో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనంతో వ్యవహరిస్తూ, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారులనుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని స్థానిక ఎన్నికల్లో నిలబడ్డ వైసీపీ నేతలతో పంపిణీ చేయడంపై పిఏసీ సభ్యులు, నాయకులు నా దృష్టికి తీసుకుకొచ్చారు. నాయకులు తమపరిధిలో చోటు చేసుకున్న ఈ తరహా పంపిణీలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండని” సభ్యులకు పవన్ కళ్యాణ్ సూచించారు. రైతులు ఎదురుకుంటున్న సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, అలాగే వైద్యులకు మాస్కులు, పిపిఈ కిట్లను తగిన విధంగా సమకూర్చని సమస్యపై కూడా స్పందించాం. ఇకపై కూడా సామాజిక దూరం పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా సేవ కార్యక్రమాల్లో పాల్గొందామని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
[subscribe]