కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేయడంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ‘అర్చక వెల్ఫేర్ ఫండ్’ ద్వారా ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు వెల్లడించారు.
రాష్ట్ర దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని వారికీ, అలాగే ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి ఈ ఆర్ధిక సాయం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. చిన్న దేవాలయాల్లో అర్చకులకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సీఎం నిర్ణయం ద్వారా దాదాపు 2,500 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు తెలిపింది.