జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం గన్నవరం విమానాశ్రయం చేరుకొని, ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో పవన కళ్యాణ్ ఎవరిని కలుస్తారు, ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమేంటనేది పార్టీ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆశక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు తన దూతగా పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పంపించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించగా, పవన్ ఢిల్లీ పర్యటనతో తమ పార్టీకేమి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ప్రకటించారు. భవననిర్మాణ కార్మికుల పరిస్థితులపై ప్రభుత్వం స్పందించకపోతే, ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
శనివారం నాడు పవన్ కళ్యాణ్ కేంద్రంలోని ప్రముఖులతో సమావేశమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్కల్యాణ్ ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్పై జాతీయ పత్రికలో వేసిన కార్టూన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. సీఎం జగన్ గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉందంటూ విమర్శించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో, 151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేసి, యాభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కిందని విమర్శించారు.
[subscribe]