తెలంగాణ భవన్లో నవంబర్ 15, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈనెల 18న నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు కేంద్ర వద్ద పెండింగ్ లో ఉండడంతో వాటిపై ఈ సమావేశాల్లో గళం వినిపించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బయ్యారం ఉక్కు కర్మాగారం, మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సహకారంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు కోసం ప్రశ్నించాలని తీర్మానించారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సైతం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఎంపీలతో సమావేశమైన సీఎం జగన్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో బొగ్గు కొరత, రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఇతర అన్ని పెండింగ్ అంశాలపై ఎంపీలకు అవగాహనా కల్పించి, నిధులు రాబట్టేలా కృషి చేయాలని కోరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడ పార్టీ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్ లో పాటించంచాల్సిన వ్యూహంపై చర్చించారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్రప్రభుత్వ పెద్దలతో చర్చించాలని సూచించారు. అలాగే ఇసుక కొరత సమస్య, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు, పోలవరం పనుల నిలిపివేత, సింగపూర్ తో స్టార్ట్ అప్ ఏరియా ఒప్పందం రద్దు వంటి అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నారు.
[subscribe]