దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. దళితులను దూషించడం తో సహా మరికొన్ని కేసుల ఎదురుకుంటున్న చింతమనేని గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఆయన నివాసంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పోలీసులు చింతమనేనిపై ఏడు కేసులు నమోదు చేసారు, అప్పటి నుంచి 12 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చింతమనేని తన ఇంటికి చేరుకున్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా అక్కడికి చేరుకొని సోదాలు నిర్వహించారు.
పోలీసుల సోదాలు నిర్వహిస్తున్న సమయంలో చింతమనేని ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో, పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు పోలీసులకు అడ్డుగా నిలిచారు. ఈ సందర్భంగా పోలీసులకు అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు అక్కడి ఉద్రిక్త పరిస్థితులను దాటుకుని ఆయన్ను అరెస్ట్ చేసారు. ముందుగా ఏలూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తారని భావించగా, పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ఆయన్ను రహస్య ప్రదేశానికి తరలించినట్టు సమాచారం.
[subscribe]
[youtube_video videoid=ptx5_sAZBfk]