టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన బస్సుపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ పార్టీ నాయకులు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, మద్దాల గిరి, తదితరులు ఉన్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పోలీసుల కుట్రతోనే చంద్రబాబు బస్సుపై దాడి జరిగిందని విమర్శించారు. రాజధాని అమరావతి పై సీఎం, రాష్ట్ర మంత్రులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం చెప్పే అవాస్తవాలును ప్రజలకు తెలియజేసేందుకే చంద్రబాబు అమరావతిలో పర్యటించారని అన్నారు. ఈ నేపథ్యంలో బయట ప్రాంతాలనుంచి జనాలను తీసుకొచ్చిన వైసీపీ చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేయించిందని ఆరోపించారు. గవర్నర్ జరిగిన సంఘటనపై వాస్తవాలు గ్రహించి, మా ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని అచ్చెన్నాయుడు తెలిపారు.
మరోవైపు అమరావతి పర్యటనలో చంద్రబాబు బస్సుపై జరిగిన దాడి గురించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జడ్ప్లస్ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై జరిగిన దాడిపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన లేఖలో కోరారు. కొన్ని రోజుల క్రితం కూడా చలో ఆత్మకూరు నిరసన సందర్భంగా చంద్రబాబును గృహ నిర్బంధం చేసి, ఇంటి గేట్లను తాళ్లతో కట్టివేశారని లేఖలో వివరించారు. చంద్రబాబు చేపట్టే జిల్లా పర్యటనల్లో కూడా ఆయన భద్రతపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు బస్సుపై దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అందుకు సంబంధించిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కళా వెంకట్రావు లేఖలో కోరారు.
[subscribe]