తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 5 నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమ్మెను విరమించిన అనంతరం వారిని ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అలాగే డిసెంబర్ 1న రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారమే అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతం విడుదల చేశారు. ముందుగా ఉద్యోగులు సమ్మె చేసిన నేపథ్యంలో వారికీ సెప్టెంబర్ నెల జీతాలుతో పాటు మిగతా సమ్మె చేసిన రోజులకు వారికీ జీతాలు చెల్లించలేదు. ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జీతాలపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన వెంటనే రూ.100 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం డిసెంబర్ 2 సోమవారం నాడు ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలను జమచేసింది.
[subscribe]