తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మూడోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమవగా, అందులో మంగళవారం ఉదయం నుంచి 18 మందిని కనుగొన్నారు. ప్రమాదం జరిగి మూడురోజులు గడవడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా కొట్టుకొస్తున్నాయి. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతమైన దేవిపట్నంలోనే ఈ రోజు 12 మృతదేహాలను కనుగొన్నారు. ధవలేశ్వరం వద్ద మూడు, పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి.
కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఛత్తీస్ ఘడ్, గుజరాత్ నుంచి రప్పించిన నిపుణులతో బోటును పైకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంకా 21 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మిగిలిన మృత దేహాలన్నీ బోటుకు దిగువున లేదా బోటులోని ఏసీ క్యాబిన్ లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ బ్యారేజి వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ ఆందోళన పడవద్దని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చి ధైర్యం చెబుతున్నారు.
[subscribe]