సెప్టెంబర్ 16న రాజస్థాన్ లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ పరిణామాలతో బీఎస్పీ పార్టీకి రాజస్థాన్ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిని కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేసి లేఖను అందజేసారు. గత కొన్నిరోజులుగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో సంప్రదింపులు జరుపుతున్న రాజేంద్ర గుడ్, జోగేంద్ర సింగ్ అవానా, వాజిబ్ అలీ, లఖాన్ సింగ్, సందీప్ యాదవ్, దీప్ చంద్ ఖేరియా బిఎస్పీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, అందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వంలో పని చేయడమే సరైనది అని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు బీఎస్పీ ఎమ్మెల్యేలు తెలిపారు. గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 100 స్థానాలు, బీఎస్పీ ఆరు స్థానాలు గెలుచుకుంది. 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తరువాత స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇప్పుడు ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడ చేరడంతో రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 118 కి చేరుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. ఇటువంటి చర్యల వల్ల మరోసారి కాంగ్రెస్ విశ్వాసఘాతుక పార్టీ అని నిరూపించుకుందని అన్నారు.
[subscribe]