సోమవారం నాడు యురేనియం త్రవ్వకాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్, వి.హనుమంతురావు, కోదండరాం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, చాడ వెంకట రెడ్డి, ఇతర పార్టీ నేతలు, పర్యావరణవేత్తలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. నల్లమల అడవుల్లో యురేనియం త్రవ్వకాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలంగాణ శాసనసభ, శాసన మండలిలో చేసిన తీర్మానాల వల్ల ఉపయోగం ఏమిలేదని, అది అసమగ్రంగా ఉందని పూర్తి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసారు.
ఈ అంశంపై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ రోజు స్పందిస్తూ, నల్లమల అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసిందని, అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానాన్ని రేవంత్ రెడ్డి అపహాస్యం చేసాడని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి చట్ట సభల్ని అవమానించారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు అసలు అడవులు ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ, అనవసర ప్రసంగాలు చేస్తూ గొప్పలు చెబుతున్నారని ఆరోపించారు. చట్టసభల్లో చేసిన తీర్మానానికి విలువ లేదన్నట్టు మాట్లాడడం సిగ్గుచేటని గువ్వల బాలరాజు విమర్శించారు.
[subscribe]