దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్ గా దేశంలో 259 మంది ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేడుకలను ఆగస్టు 15, 2022 కి 75 వారాల ముందు ప్రారంభించాలని నిర్ణయించారు. అనగా జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలోని చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహ 91 వ వార్షికోత్సవమైన మార్చి 12, 2021న 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. వేడుకల కోసం మార్చి 12, 2021 నుండి ప్రారంభమయ్యే సన్నాహక కార్యకలాపాలకు సంబంధించిన పద్ధతులను చర్చించడానికి ఈ ఉన్నత స్థాయి కమిటీ యొక్క మొదటి సమావేశాన్ని మార్చి 8, 2021న నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ 259 మంది ఉన్నతస్థాయి సభ్యుల కమిటీలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ బాబ్డే సహా పలువురు గవర్నర్లు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, వైద్యులు ఇలా పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఇక ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, దర్శకుడు రాజమౌళి, పార్మా సంస్థ భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, మిథాలీరాజ్, పీవీ సింధు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ