తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని బీజేపీ అధిష్ఠానం గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలకు మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు కొలిక్కివచ్చాయి. 20 అసెంబ్లీ స్థానాలతో పాటుగా, ఉపఎన్నిక జరగనున్న కన్యాకుమారి లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టు శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల కీలక నేతల మధ్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మరణంతో ఖాళీ అయిన కన్యాకుమారి లోక్సభ స్థానంలో బీజేపీ పార్టీ తరపున పొన్ రాధాకృష్ణన్ పోటీచేయనున్నట్టు ప్రకటించారు.
మరోవైపు ఆరుగురు సభ్యులతో శుక్రవారం నాడు అన్నాడీఎంకే పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. ప్రస్తుత తమిళనాడు సీఎం పళనిస్వామి ఎడప్పాడి నుంచి పోటీచేస్తుండగా, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం బోడినయకనూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మంత్రులు జయకుమార్, షణ్ముగమ్లు రాయపురమ్, విలుపురమ్ నుంచి బరిలో దిగనుండగా, ఎమ్మెల్యేలు పి.షణ్ముగనాథన్ మరియు ఎస్.తెన్మోజి శ్రీవైగుండం, నీలకొట్టై అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇక సీట్ల పంపకంలో మిత్రపక్షమైన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) పార్టీకి 23 సీట్లు కేటాయిస్తున్నట్టు అన్నాడీఎంకే ప్రకటించింది. మరో మిత్రపక్షమైన ప్రముఖ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే పార్టీకి సీట్ల కేటాయింపుపై ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ