మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నవంబర్ 17, 18 వ తేదీలలో పార్టీ క్రియాశీలక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలలో పాల్గొననున్నారు. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ అయిదు నియోజకవర్గాలపై సమీక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. క్రియాశీలక సభ్యులకు పార్టీ అందిస్తున్న ఇన్సూరెన్సు సౌకర్యానికి సంబంధించి కొందరు సభ్యులకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ధ్రువపత్రాలను ప్రదానం చేయనున్నారు.
నవంబర్ 17 న నాలుగు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం:
నవంబర్ 17 మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇక 18వ తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. మరోవైపు క్రియాశీలక సభ్యత్వం ప్రారంభం కానున్న మరో 32 నియోజకవర్గాల ఇంచార్జిలతో కూడా సమావేశం కానున్నారు. సభ్యత్వ నమోదు కోసం పార్టీ ఐ.టి.విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. ఈ రెండు సమావేశాలలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ