దేశంలో నిరుద్యోగంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ శనివారం నాడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. దేశంలో ఉపాధి అవకాశాలకు కొదవలేదని, తగిన ఉద్యోగాలు ఉన్నాయని అయితే వాటికీ దరఖాస్తు చేసుకుంటున్న ఉత్తర భారత దేశానికి చెందిన అభ్యర్థుల్లో తగిన నైపుణ్యాలు ఉండడం లేదని గాంగ్వర్ పేర్కొన్నారు. ఈ విషయంపైనా పలువురు రిక్రూటర్లు తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. గాంగ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు విరుచుకుపడ్డారు. మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ దేశవ్యాప్తంగా పలువురు నాయకులు డిమాండ్ చేసారు.
గాంగ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్లో స్పందించారు. ఉద్యోగాలు కల్పించడంలో గడిచిన ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, ఆర్ధిక మందగమనం వలన ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుండడం వలన ఉత్తర భారతదేశం వారిని అవమానించి ఇలా తప్పించుకోవాలని చూస్తున్నారని ప్రియాంక విమర్శించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ దేశం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అయితే సంతోష్ కుమార్ గాంగ్వర్ తన మాటలపై వివరణ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం అభ్యర్థుల నైపుణ్యాలను పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేసానని చెప్పారు. నైపుణ్యం లేని వారికీ శిక్షణ ఇచ్చి, అర్హత ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=mwk0H1fShrw]