కోవిడ్ – 2019 (కరోనా వైరస్) ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తుండడంతో ఆ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడింది. దీంతో దేశీయ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కోనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు దేశీయ మార్కెట్ సూచీలు సైతం భారీ స్థాయిలో పడిపోయాయి. వరుసగా ఆరో రోజు మార్కెట్లు నష్టాల బాటపట్టడంతో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురవవుతున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 1136 పాయింట్లు నష్టపోయి 38,608 వద్ద ట్రేడవుతుంది. అలాగే నిఫ్టీ 339 పాయింట్లు దిగజారి 11,294 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి విలువ రూ.71.66 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిమిషాల వ్యవధిలోనే 5లక్షల కోట్లు నష్టపోయినట్టుగా తెలుస్తుంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో విప్రో, ఫ్యూచర్ కన్స్యూమర్, హీరో మోటోకార్ప్, ఫ్యూచర్ రిటైల్, ఎబిబి ఇండియా మరియు బంధన్ బ్యాంక్ గత 52వారాల్లో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 50 సూచికలో టాటా మోటార్స్, టాటా స్టీల్, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, జెఎస్డబ్ల్యు స్టీల్ అధికంగా నష్టపోయిన స్థానాల్లో ఉన్నాయి. ఇటు ఆసియా మార్కెట్లుతో పాటుగా అమెరికా, యూకే, ఇటలీకి చెందిన మార్కెట్లు కూడా నష్టాలలోనే ఉన్నాయి. అమెరికాకు చెందిన నాస్డాక్ 3.7శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 3.3శాతం, ఇటలీ మార్కెట్లు 6శాతం మేరకు నష్టాల్లో కోనసాగుతున్నాయి. ఇక 2008 సంవత్సరంలో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం తర్వాత ఒక వారం పాటు ప్రపంచ మార్కెట్లు ఇంత స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి అని మార్కెట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
[subscribe]