కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో అన్ని గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ ప్రాంతాలలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మద్యం, పాన్ దుకాణాల వద్ద కనీసం 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఒకేసారిగా ఐదుగురి కంటే ఎక్కువ మంది దుకాణాల వద్ద ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణాల వద్ద ప్రజలు గుమికూడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
ముందుగానే ఆయా రాష్ట్రాల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానం, తదితర అంశాల ఆధారంగా దేశంలో అన్ని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించారు. మూడోసారి కూడా లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గుచూపిన కేంద్ర ప్రభుత్వం ఈసారి గ్రీన్ జోన్స్ లలో అన్ని సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తూ, ఆరెంజ్ జోన్ ప్రాంతాల్లో గణనీయమైన మినహాయింపులు ఇచ్చారు. అయితే రెడ్ జోన్స్ లో మాత్రం కట్టుదిట్టంగా లాక్డౌన్ ను అమలు చేయాలనీ ఆదేశాలిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా 130 రెడ్ జోన్ జిల్లాలు, 284 ఆరెంజ్ జోన్ జిల్లాలు, 319 గ్రీన్ జోన్ జిల్లాలు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రెడ్ జోన్ లో 6, ఆరెంజ్ జోన్ లో 18, గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు ఉన్నాయి. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో రెడ్ జోన్ లో 5, ఆరెంజ్ జోన్ లో 7, గ్రీన్ జోన్ లో 1 జిల్లా ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu