ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. ఈ మేరకు సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్నీ తెలియజేసే ఒక వీడియోను పోస్ట్ చేశారు. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్ లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఏడాది నిషేధానికి గురవడంతో ఐపీఎల్-2018 సీజన్లో వార్నర్ ఆడలేదు, అలాగే కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. ఈ నేపథ్యంలో 2018 సీజన్లో భువనేశ్వర్ కుమార్, 2019 సీజన్లో కేన్ విలియమ్సన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించారు. అయితే 2015 నుంచి 2017 సీజన్ల వరకు సన్ రైజర్స్కు కెప్టెన్ గా వ్యవహరించిన వార్నర్ వైపే టీం యాజమాన్యం మరోసారి మొగ్గుచూపుంది. గత ఏడాది అద్భుతంగా రాణించిన డేవిడ్ వార్నర్ కు రాబోయే సీజన్ సారథ్య బాధ్యతలు అప్పగించి మరో అవకాశం ఇచ్చింది.
సన్రైజర్స్ కెప్టెన్ గా తనను నియమించడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. ”ఐపీఎల్ 2020లో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్ గా నియమించబడినందుకు సంతోషంగా ఉంది. గత రెండు సంవత్సరాలు కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ లు జట్టును అద్భుతంగా నడిపించారు, వారికీ ధన్యవాదాలు. ఈసారి కూడా జట్టును విజయంవైపు నడిపించేందుకు వారి అభిప్రాయాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటాను. కెప్టెన్ గా నాకు మరో అవకాశం ఇచ్చినందుకు ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. 2020లో ట్రోఫీని గెలిచేందుకు తగిన కృషి చేస్తాము, సన్రైజర్స్ ఫాన్స్ ను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నానంటూ” డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు.