భారత్-వెస్టిండీస్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 15, ఆదివారం నాడు జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ జట్టు నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని 47.5 ఓవర్లలోనే వెస్టిండీస్ జట్టు చేధించింది. షిమ్రోన్ హెట్మైర్ (139: 11 ఫోర్లు, 7 సిక్స్లు) తో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, షై హోప్ (102: 7 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ హెట్మైర్, షై హోప్ సెంచరీలు చేయడంతో వెస్టిండీస్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. అలాగే మ్యాచ్ చివర్లో నికోలస్ పూరన్ (29: 4ఫోర్లు) పరుగులతో తనవంతు సహకారం అందించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ, దీపక్ చహర్ చెరో వికెట్ తీశారు. తోలి వన్డేలో గెలుపుతో మూడు వన్డేల సిరీస్లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శ్రేయాస్ అయ్యర్ (70: 5 ఫోర్లు, ఒక సిక్స్), రిషభ్ పంత్ (71: 7 ఫోర్లు, 1సిక్స్) మంచి ప్రదర్శన చేయడంతో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ(36) పరుగులతో రాణించినా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(6), కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) వికెట్లును ఒకే ఓవర్లో వికెట్లు కోల్పోవడంతో భారత్ జట్టు ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో యువ బ్యాట్స్ మెన్ పంత్, శ్రేయాస్ అయ్యర్ సందర్భానికి తగినట్టుగా ఆడుతూ నాలుగో వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరూ వెంటవెంటనే అవుట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ (40), రవీంద్ర జడేజా (21) పరుగులు చేశారు. శివమ్ దూబే(9) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో భారత్ జట్టు చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. వెస్టిండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్ తలో రెండు వికెట్లు తీయగా, పోలార్డ్ ఒక వికెట్ పడగొట్టాడు. రెండో వన్డే మ్యాచ్ డిసెంబర్ 18 బుధవారం నాడు విశాఖపట్నంలో జరుగనుంది.