ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ, అఖిలపక్ష నాయకులు నవంబర్ 14, గురువారం నాడు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేసిన డిమాండ్ను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఆర్టీసీని విలీనం చేస్తేనే చర్చిస్తామంటున్నారని, విలీన డిమాండ్పై కార్మిక సంఘాలు పట్టు వీడడం లేదంటూ దుష్ప్రచారం జరుగుతోందని అశ్వత్థామరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆర్టీసీ విలీనం డిమాండ్ను వదులుకుంటున్నామని, ఇకనైనా ఇతర డిమాండ్లపై ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సూచనలను కూడ పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పారు. కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తరఫునుంచి కనీసం ప్రకటన చేయడం గాని, ఒక్క ఎమ్మెల్యే, ఒక మంత్రి గాని పరామర్శించి సానుభూతి ప్రకటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు మనో వేదనకు గురికావద్దని, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. నవంబర్ 15న గ్రామాల్లో బైక్ ర్యాలీలు, 16న సామూహిక నిరాహార దీక్షలు, 17, 18 తేదీలలో అన్ని బస్ డిపోల ముందు సామూహిక దీక్షలు, ఇక 19న హైదరాబాద్–కోదాడ జాతీయ రహదారిపై సడక్బంద్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
[subscribe]