నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గత మార్చ్ 5 కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం గత ఏప్రిల్ 7 నే పోలింగ్ జరగాల్సి ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహణ ప్రక్రియను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ నిర్వహణ, ఓట్ల కౌంటింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. అక్టోబర్ 9 వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 12 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
ముందుగా పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హుడిగా ప్రకటించారు. టిఆర్ఎస్ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరెడ్డి, ఆతర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించాడని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని టిఆర్ఎస్ శాసనమండలి పక్షం మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు వేశారు. ఈ అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. మరోవైపు ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వివరాలు:
- పోలింగ్ తేదీ: అక్టోబర్ 9 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
- ఓట్ల లెక్కింపు పక్రియ: అక్టోబర్ 12
- ఉప ఎన్నిక పక్రియ ముగింపు: అక్టోబర్ 14
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu