భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నవంబర్ 14, గురువారం నాడు ఇండోర్ వేదికగా తోలి టెస్టు ప్రారంభమైంది. భారత బౌలర్ల అద్భుత బౌలింగ్ తో తోలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ బౌలింగ్ ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా 2 వికెట్లు తీశారు. దీంతో తోలి రోజే ఈ టెస్టులో భారత్ పట్టు బిగించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు గురువారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 6 పరుగులు చేసి అవుట్ అవ్వగా, మయాంక్ అగర్వాల్ 37, చటేశ్వర్ పుజారా 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. తోలి ఇన్నింగ్స్ లో భారత్ మరో 64 పరుగులు మాత్రమే వెనుకంజలో ఉంది.
ముందుగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. బంగ్లా జట్టు 12 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ కైస్ (6)ను ఉమేష్ యాదవ్, మరో ఓపెనర్ షాద్మన్ (6)ను ఇషాంత్ శర్మ అవుట్ చేశారు. 31 పరుగుల వద్ద 13 పరుగుల చేసిన మిథున్ ను షమీ అవుట్ చేశాడు. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను కెప్టెన్ మోమినుల్ హక్(37), ముష్ఫికర్ రహీమ్ (43) పరుగులతో ఆదుకున్నారు. వారిద్దరికీ మినహా మిగతా బ్యాట్స్ మెన్ అంతా వరుసగా వికెట్లు ఇచ్చేస్తూ విఫలమవడంతో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసిన అశ్విన్ స్వదేశంలో 250 వికెట్ల మార్కును అందుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లగా మొదటి రెండు స్థానాల్లో కుంబ్లే (350), హర్భజన్ సింగ్ (265) ఉన్నారు.