67వ జాతీయ చలనచిత్ర అవార్డులను సోమవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ నుండి జెర్సీ, మహర్షి చిత్రాలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినీ రంగం నుంచి అవార్డులకు ‘మహర్షి’, ‘జెర్సీ చిత్రాలు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచిన ‘మహర్షి’ చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, చిత్ర కథానాయకుడు మహేశ్ బాబుకు అభినందనలు. ఇదే చిత్రం ద్వారా ఉత్తమ నృత్య దర్శకులుగా రాజు సుందరం ఎంపిక కావడం ఆనందకరం. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘జెర్సీ’ నిర్మించిన సూర్యదేవర నాగ వంశీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, చిత్ర కథానాయకుడు నాని, ఇదే చిత్రానికి పని చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ అవార్డుకి ఎంపికైనందుకు అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రాల దర్శకులు, నిర్మాతలు జాతీయ పురస్కారాలు ఇచ్చిన స్ఫూర్తితో ప్రేక్షకులను మెప్పించే మరిన్ని మంచి చిత్రాలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ