తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపిక కొనసాగుతోంది. పలు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు అవసరం ఉండడంతో ఛైర్మన్ల ఎన్నిక పక్రియ ఆసక్తికరంగా మారింది. కొన్ని చోట్ల అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం నాడు మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపికపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లను పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం సీల్డ్ కవర్లలో వారిపేర్లను భద్రపరిచి ఆదివారం రాత్రికి అన్ని జిల్లాలకు పంపించారు. అలాగే అవసరమైన చోట్ల మజ్లీస్ పార్టీ సహకారం తీసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలుసుకుని చర్చించారు. నిజామాబాద్లో మేయర్ ఎంపికలో మజ్లీస్ సహకారం అవసరమైనందున, అక్కడ వారికీ డిప్యూటీ మేయర్ పదవిని ఇచ్చేందుకు టిఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
ఈ రోజు జరుగుతున్న మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియలో పలు చోట్ల ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లును టిఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. పెద్దఅంబర్పేట్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని టిఆర్ఎస్ దక్కించుకోనుంది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కొంతమంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ లో చేరడంతో, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓట్లతో కలిపి ఛైర్మన్ పదవిని టిఆర్ఎస్ దక్కించుకుంటుంది. బీజేపీ ఆధిపత్యం సాధించిన తుక్కుగూడ మున్సిపాలిటీ, చౌటుప్పల్, ఆదిభట్ల మున్సిపాలిటీల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్దే చైర్మన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. మరోవైపు సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీకి ఎక్స్అఫిషియో ఓటు హక్కు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నిరసన తెలపడం, ఇతర పరిణామాలు చోటుచేసుకోవడంతో చైర్మన్ ఎంపికను మంగళవారానికి వాయిదా వేశారు.
[subscribe]