ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాసనమండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ శాసనసభాపక్షం సమావేశమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. శాసనమండలి రద్దుపై కేబినెట్ నిర్ణయం, శాసనసభలో జరుగుతున్న చర్చ, ఇతర పరిణామాలపై పార్టీనేతలతో చంద్రబాబు చర్చించారు.
ముందుగా జనవరి 26, ఆదివారం సాయంత్రం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో సోమవారం నాడు జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొద్దని టీడీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. శాసన మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అలాగే సభను నిర్వహించే విషయంలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం లకు టీడీపీ శాసనసభ పక్షం లేఖ రాసింది. ముందుగా కేవలం మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని బీఏసీలో నిర్ణయించి, బీఏసీకి చెప్పకుండానే సమావేశాలను పొడించారని అన్నారు. అదేవిధంగా ఒకసారి సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు.
[subscribe]