ఎస్ఆర్ నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 22 వేల మంది ఆశా వర్కర్స్, 500 మంది ఏఎన్ఎం లతో ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ, కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన మొదటి రోజు నుండి హెల్త్ వారియర్స్ కంటిమీద కునకులేకుండా పని చేస్తున్నారు. 6 నెలల అనుభవంలో కరోనాకి చంపే శక్తి లేదు అని తెలిసిపోయింది. 99 శాతం మంది బయటపడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోకి వచ్చింది. భయం లేకుండా ఎదుర్కొంటే కరోనాను జయించవచ్చు ఈ ధైర్యాన్ని ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు ప్రజలందరికీ కల్పించాలని చెప్పారు.
“ప్రపంచంలో ఎక్కడ అయిన కరోనాకి చికిత్స ఒక్కటే. అనవసరంగా కార్పోరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ కూడా చేస్తున్నాము. గ్రామాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తించగలిగితే వ్యాప్తినీ అరికట్టవచ్చు, ప్రాణాలు కాపాడవచ్చు. గ్రౌండ్ లెవల్ లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ దీని మీద పూర్తి అవగాహన వచ్చింది. ప్రజలను కూడా చైతన్య పరిచి అతి త్వరలో పూర్తిగా అడ్డుకట్ట వేద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలం అని పదే పదే చెప్తున్నారు. ఇతర సీజనల్ వ్యాధులు, కరోనా ఒకటే లక్షణాలు కలిగి ఉంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాలి. రాపిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాలి. అప్పుడే రిలాక్స్ అవ్వవద్దు. జనవరి వరకు ఇదే స్ఫూర్తి తో పని చేయాలి. కరోనాతో పాటు ఇతర వైద్య సేవలు కూడా అందించాలి” అని మంత్రి ఈటల పేర్కొన్నారు.
“దేశంలో అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇది మనకి గర్వ కారణం. వైద్య సిబ్బంది అందరి వల్లనే ఇది సాధ్యం అయ్యింది. కోవిడ్ సమయంలో పనిచేయడం మీ అందరికీ గొప్ప జ్ఞాపకం. భరోసా కల్పించి ప్రాణాలు కాపాడండి” అంటూ ఆశా, ఏఎన్ఎం లకు మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆశా, ఏఎన్ఎం లతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వారి సమస్యలు అన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. జీతం పెంచే విషయం సీఎంతో చర్చిస్తామన్నారు. కరోనా తరువాత ప్రతి జిల్లా ఆశా, ఏఎన్ఎం లతో ప్రత్యేకంగా సమావేశం అవుతామని తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా ఎర్రగుంట పీహెఛ్సీ సుశీల, వనపర్తి జిల్లా మదనపురం లీలమ్మ, హైదరాబాద్ రాణిగంజ్ నల్లగుట్ట-పద్మ, గ్యాస్ మండి-శ్రీలక్ష్మీ లను మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu