హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి శనివారం నాడు మంత్రి కేటిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం గత ఆరు సంవత్సరాల్లో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్నారు. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తుందని చెప్పారు.
”తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నది. సామాన్యుడిపై ఏలాంటి భారం పడకుండా సామాన్యుడికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకొచ్చాం. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయి. వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తులకి ప్రత్యేకంగా రెండు వేరు వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు ఇస్తాము. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా భూ సమస్యలు తొలగిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా వున్నది. ఇందులో వివిధ కారణాలతో కొన్ని ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయని” మంత్రి కేటిఆర్ అన్నారు.
“ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. కేవలం ప్రజలకు వారి ఆస్తుల పైన హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో భాగంగా విస్తృతంగా చర్చించిన తర్వాత అవసరమైతే కేబినెట్ ద్వారా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. భవిష్యత్తులో హైదరాబాద్ లోని ఆస్తుల క్రయ విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుంది. ఇందుకోసం శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని ఒక్కపైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని” మంత్రి కేటిఆర్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ డిఎస్ లోకేష్ కుమార్, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు శ్వేతా మొహంతి, అమయ్ కుమార్, వాసం వెంకటేశ్వర్లు, ఈవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu