ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో త్రాగునీరు మరియు సాగునీటికి ఉపయోగపడే రెండు ప్రాజెక్టులను ప్రారంభించారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను లాంఛనంగా ప్రారంభించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సీఎం జగన్ కొబ్బరికాయ కొట్టి సంగం బ్యారేజ్ను ప్రారంభించి పెన్నా నదికి హారతి ఇచ్చారు. అనంతరం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్, మేకపాటి గౌతమ్ రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుబుంబ సభ్యులు, ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సంగం, నెల్లూరు బ్యారేజీ ప్రాజెక్టులకు 2006, 2008లో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, వాటిని నేడు తాను ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభించి జాతికి అంకితం చేయడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు బ్రిటీష్ హయాంలో ఎత్తిపోతల పథకాలేనని, గతంలో ఏ ప్రభుత్వం కూడా వీటిపై దృష్టి సారించలేదని, ప్రాజెక్టుల దుస్థితిని గమనించిన వైఎస్ఆర్ జల యజ్ఞంలో భాగంగా వాటిని ఆధునీకరించేందుకు ప్రణాళిక రూపొందించారని గుర్తు చేశారు. ఈ రెండు బ్యారేజ్ల నిర్మాణానికి రూ. 380 కోట్లు కేటాయించామని, తద్వారా జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల సాగు భూమికి నీరు అందనుందని వివరించారు.
రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన చేపడుతున్నామని, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈ క్రమంలో ఏపీలో 26 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి ప్రతిపాదనల మేరకు హైవే నుంచి సంగం బ్యారేజి వరకు రోడ్ కోసం రూ.15 కోట్లు, ఇరిగేషన్ పనులకు మరో రూ. 40 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సంగం పంచాయితీకి రూ.4 కోట్లు, 25 గ్రామాలకు రోడ్లు వేయడానికి రూ.14 కోట్లు మంజూరు చేస్తున్నామని, అలాగే మరో రూ.12 కోట్లు స్పెషల్ గ్రాంట్గా కేటాయిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY