రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సంస్థకు రూ.1500 కోట్లు, అదనంగా మరో రూ.1500 కోట్లు బడ్జెటేతర నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని ప్రభుత్వం సంస్థకు నెల నెలా సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా బడ్జెటేతర నిధుల కింద తొలి విడతగా ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1000 కోట్లు బ్యాంకు రుణంగా మంజూరు చేయడం జరిగిందని, ఇందులో రూ.500 కోట్లు వచ్చాయని, మరో రూ.500 కోట్లు త్వరలో వస్తాయని మంత్రి చెప్పారు. ఈ నిధుల్ని సంస్థ ఆవసరాల కోసం ఎలా వినియోగించాలనే విషయంపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ప్రస్తుతం రోజుకు 9 కోట్ల ఆదాయం, మరో 2 లేదా 3 కోట్లకు పెంచుకోగలిగితే ఆర్థిక స్థితి మెరుగు:
సంస్థ ఆర్థికావసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులను కేటాయించడంతో పాటు పదవి విరమణ పొందిన ఉద్యోగుల కోసం కూడా వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇవే కాకుండా ఎన్.సి.డి.సి బ్యాంకు ద్యారా ప్రభుత్వ పూచికత్తుతో మరో రూ.500 కోట్లను లోన్ తీసుకుని సి.సి.ఎస్ బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సంస్థ అభ్యున్నతి కోసం ఉద్యోగులు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమంటూ ప్రస్తుతం టిక్కెట్టు ద్వారా వస్తున్న రూ.9 కోట్లను మరో 2 లేదా 3 కోట్లకు పెంచుకోగలిగితే సంస్థ ఆర్థిక స్థితి కొంత మెరుగు పడగలదని మంత్రి పువ్వాడ అజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో స్ఫెషల్ చీఫ్ సెక్రటరీ, టిఆర్ అండ్ బి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి, సంస్థ ఆర్థిక సలహాదారు రమేశ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ