తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మధుయాస్కీ, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్యయ్య, మహేశ్వర్రెడ్డి, దాసోజు శ్రవణ్కుమార్, బలిరాంనాయక్, ప్రేంసాగర్రావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఇంద్రవెల్లి స్తూపం వద్ద అమరవీరులకు రేవంత్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం సభకు హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్ధేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దళితులు, గిరిజనులకు ఎప్పుడూ అండగా ఉండేదీ, వారి అభివృద్ధి కోసం పాటుపడేదీ కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు ఇక మిగిలింది ఇరవై నెలలేనని, నిన్నటి వరకు ఓ లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తల అండతో మరో 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం రావడం ఖాయమని తెలిపారు. ప్రస్తుత పాలనలో ఎస్సీ, ఎస్టీల జీవితాలు చితికిపోతున్నాయని, ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్ ప్రణాళిక అని అన్నారు. ఎన్నికల కోసమే పథకాలు తెచ్చానని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు.
దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు ఇవ్వరు?:
ఉప ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ఎస్సీలు గుర్తుకొస్తారని, దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. దళితబంధు రావాలంటే రాష్ట్రంలోని మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాల్సిందేనని అన్నారు. హుజురాబాద్ లో దళితబంధును అమలు చేస్తున్నట్లుగానే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కూడా అమలు చేయాలని, గిరిజనులకు కూడా గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫూర్తి రగులుతుందని అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలిచ్చిన నేల ఇంద్రవెల్లి అని తెలిపారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కుమురంభీమ్ గడ్డ ఇదేనన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమురం భీం పోరాడారని గుర్తు చేశారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్దేనని హామీ ఇచ్చారు.
తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారు. ఎస్సీని ఉపముఖ్యమంత్రిని చేసి రెండు నెలలకే తొలగించారు. మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను దళిత బిడ్డను కాకపోయినా, నల్లమల అడవుల్లో పుట్టి, దళిత ఆదివాసీల బాధలను దగ్గరగా చూశానని తెలిపారు. తాను మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు. ఇక ఆగస్టు 18న ఇబ్రహీంపట్నంలో రెండో దళిత-గిరిజన దండోరా సభను నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దళిత, గిరిజన దండోరా సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అడవిని నమ్ముకున్న గిరిజనులను పోలీసులతో కొట్టిస్తున్నారన్నారు. దళితబంధును 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలి. దళిత బంధులాగే ఎస్టీలకు కూడా ఒక పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ