టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. భారత్ అథ్లెట్లలో కొందరు ఇంతకుముందే భారత్ చేరుకోగా, మిగిలిన వారంతా సోమవారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారత్ అథ్లెట్లకు ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులతో పాటుగా సంబంధిత విభాగాల అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్ రవి కుమార్ దాహియా రజత పతకాలు సాధించారు. బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ బజరంగ్ పూనియా, బాక్సర్ లవ్లీనా బొర్గోహేన్, భారత హాకీ జట్టు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.
దేశానికి చేరుకున్న ఒలింపిక్ పతక విజేతలను సోమవారం సాయంత్రం న్యూ ఢిల్లీలోని అశోక హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర క్రీడా సహాయమంత్రి నిషిత్ ప్రామాణిక్ మరియు న్యాయ మంత్రి కిరెన్ రిజిజు ఘనంగా సన్మానించారు. ఒలింపిక్స్ లో అథ్లెట్ల ప్రదర్శన, పోరాటపటిమపై కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపించారు. నీరజ్ చోప్రా, రవి కుమార్ దాహియా, బజరంగ్ పూనియా, లవ్లీనా బొర్గోహేన్, భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, క్రీడాకారులను, జట్టు సిబ్బందిని మంత్రులు సన్మానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ