తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పటికే టికెట్ దక్కలేదని పలువురు దిగ్గజ నేతలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేశారు. సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా చాలా మంది నేతలు బీఆర్ఎస్కు టాటా చెప్పేశారు. మరికొంత మంది కూడా పార్టీ మారేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న వారిలో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు బలంగా వినిపిస్తోంది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పార్టీ మారే ప్లాన్లో ఉన్నారట. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సుభాష్ రెడ్డిని బీఆర్ఎస్ అధిష్టానం పక్కన బెట్టింది. సుభాష్ రెడ్డికి కాకుండా ఉప్పల్ నియోజకవర్గ టికెట్ను బండారి లక్ష్మారెడ్డికి అధిష్టానం కట్టబెట్టింది. అప్పటి నుంచి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నారు. పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటి నుంచి సుభాష్ రెడ్డి.. అధికారిక కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. పార్టీలో సీనియర్లతో కూడా అంటీ అంటనట్లే వ్యవహరిస్తున్నారు. అయితే ఆ తర్వాత అసంతృప్తులను బీఆర్ఎస్ అధిష్టానం చల్లార్చే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు మరికొందరికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టింది. అప్పుడైనా పదవిని ఇస్తారేమోనని సుభాష్ రెడ్డి ఎదురు చూశారు. కానీ అప్పుడు కూడా అతనికి నిరాశే ఎదురయింది. అధిష్టానం మొండి చేయే చూపించింది.
అయితే వరుసగా అవమానాలు ఎదురవుతుండడంతో భేతి సుభాష్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారట. అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. త్వరలో సుభాష్ రెడ్డి కాషాయపు కండువా కప్పుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో కూడా భేతి సంప్రదింపులు జరిపారట. ఉప్పల్ నియోజకవర్గంలో సర్వే చేయించాకే.. పార్టీలో చేరేందుకు సుభాష్ రెడ్డికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరో రెండు, మూడు రోజుల్లో భేతి సుభాష్ రెడ్డి కాషాయపు తీర్థం పుచ్చుకోవడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది.