తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గురువారం నాడు నగరంలోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరున్నరేళ్లు కావస్తోందని అన్నారు. అంతకుముందు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో అనిశ్చితి ఉందని, టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రాంతీయవిబేధాలు వస్తాయని, శాంతి భద్రతలకు ఇబ్బంది జరుగుతుందని ఇలా ఎన్నో రకాల దుష్పచారాలు, ఆరోపణలు చేశారని చెప్పారు. కానీ ఆరున్నరేళ్ల తరవాత భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, ప్రశాంత వాతావరణంలో అన్ని ప్రగతి కోణాల్లో ముందుకెళ్తున్నామని అన్నారు. అందుకు కారణం సీఎం కేసీఆర్ అని, ఒక అసాధారణమైన పరిణితి ప్రదర్శించి ఎక్కడా కూడా గిల్లి కజ్జాలు, పంచాయితీలకు చోటివ్వకుండా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లడం వలనే ఈ రోజు తెలంగాణ అన్ని విషయాల్లో గొప్ప అభివృద్ధి వైపు దూసుకెళ్తుందన్నారు.
నగరంలో పటిష్ఠమైన శాంతిభద్రతలు:
సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక హైదరాబాద్ నగరంలో 2 వేలు కోట్లకుపైగా ఖర్చుపెట్టి ప్రజలకు మంచినీటికి ఇబ్బందులు లేకుండా చేశారని చెప్పారు. అలాగే నగరంలో పటిష్ఠమైన శాంతిభద్రతలు కొనసాగుతున్నాయన్నారు. నగరంలో గతంలా పేకాట క్లబ్స్, గుడుంబా, అల్లర్లు, మత కల్లోలాలు, కర్ఫ్యూ పరిస్థితులు లేవని ఈ వాస్తవాలను అందరూ ఆలోచించాలని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్ నగరం దేశంలోనే 1 వ స్థానంలో, ప్రపంచంలో 16వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బేతీసే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం:
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. ప్రజలపై ఎలక్ట్రిసిటీ, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్లులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలులకు సంబంధించి ఒక్క పైసా కూడా భారం మోపలేదని అన్నారు. ఎస్ఆర్డీపీ ద్వారా నగరంలో అనేక రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిస్థితులుతో పాటుగా అనుకూలమైన ప్రభుత్వ విధానాలు వలనే పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. త్వరలోనే కొంపల్లి ప్రాంతంలో కూడా ఐటీ పార్కును ప్రారంభిస్తామని చెప్పారు. అన్నపూర్ణ పథకం ద్వారా రోజు 50 వేల మందికి నాణ్యమైన బోజనం అందిస్తున్నాం. అలాగే బస్తీ దవాఖానాల ప్రజలకు వద్దకే మెరుగైన వైద్యసేవలు తీసుకెళ్లామని తెలిపారు. ఇక నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉందని, దశలవారీగా పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎవరూ దెబ్బేతీసే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని, అందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని మంత్రి కేటిఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ