ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26 న పాడి పశువులు పంపిణీ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ అంశంపై గురువారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా లబ్ధిదారులు, వారికీ పంపిణీ చేసే పాడి పశువులు వివరాలపై సీఎం పరిశీలన చేశారు. నవంబరు 26 వ తేదీన తొలిదశలో వర్చువల్ విధానంలో 4 వేల గ్రామాల్లో పాడి పశువుల పంపిణీని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేపట్టి, అనంతరం దశల వారీగా పాడి పశువుల పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.
వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులైన మహిళలు కోరిన విధంగా ఆవులు-2,11,780, గేదెలు-2,57,211, గొర్రెలు-1,51,671, మేకలు-97,480 లను పంపిణీకి సిద్ధం చేసినట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. లబ్ధిదారులకు అందించే ప్రతి పశువునూ పశు సంవర్థక శాఖ అధికారులు భౌతికంగా తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పంపిణీలో ముఖ్యమైన పర్చేజ్ కమిటీ బలంగా ఉండాలని, సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు అందులో ఉండాలని సూచించారు. బీమా సంస్థ ప్రతినిధితో పాటుగా, బ్యాంకర్ ను కూడా పర్చేజ్ కమిటీలో సభ్యులుగా ఉండాలని చెప్పారు. ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వెటర్నరీ సర్వీసులను బలోపేతం చేయాలని సూచించారు.
మరోవైపు వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాల కింద పలు గ్రామాల్లో మహిళలు ఏర్పాటు చేసుకున్న చిల్లర దుకాణాలపై సీఎం సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో కలిపి 78 వేల దుకాణాలను మహిళలు ప్రారంభించారని అధికారులు సీఎంకు వివరించారు. కాగా ఇటీవల వైఎస్ఆర్ చేయూత కింద కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది మహిళల నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ